న్యూఢిల్లీ: ఎవరిది అసలైన శివసేన పార్టీ అనే విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. అసలైన శివసేన మాదంటే, మాదేనంటూ రెండు వర్గాలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేన పార్టీ పేరును, గుర్తును ఫ్రీజ్ చేసింది.
అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీకి ఉద్ధవ్ థాకరే వర్గం, ఏక్నాథ్ షిండే వర్గం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు రెండు వర్గాలు ఇప్పటికే కొత్త పేర్లు, గుర్తులకు సంబంధించిన ఆప్షన్లను ఈసీకి సమర్పించాయి. ఈ క్రమంలోనే శివసేన పార్టీ పేరును, గుర్తును ఈసీ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాకరే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కాగా, అసలైన శివసేన తమదే అని నిరూపిస్తూ ఆగస్టు 8లోగా డాక్యుమెంటరీలు సమర్పించాలని గతంలోనే ఈసీ రెండు వర్గాలను ఆదేశించింది. అయితే థాకరే వర్గం అభ్యర్థనతో గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అయితే, ఉప ఎన్నికల్లో పోటీ కోసం తమకు శివసేన విల్లు బాణం గుర్తు కేటాయించాలని షిండే వర్గం ఈసీని అభ్యర్థించింది.
దాంతో షిండే వర్గం అభ్యర్థనపై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం ఉద్ధవ్ థాకరే వర్గాన్ని కోరింది. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం శనివారమే ఈసీకి తన స్పందన తెలియజేసింది. షిండే వర్గం డాక్యుమెంటేషన్ క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలని కోరింది.