ముంబై: మహారాష్ట్రలోని శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు అందాయి. మహారాష్ట్ర శాసనసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇరు వర్గాల నుంచి అందిన దరఖాస్తులపై అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ స్పందించారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ 53 మంది శివసేన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 39 మంది తిరుగుబాటు షిండే వర్గానికి చెందిన వారు కాగా, 14 మంది మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే వెంట ఉన్నారు.
కాగా, ఈ నెల 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. స్పీకర్ ఎన్నిక, సీఎం షిండే బలనిరూపణ సందర్భంగా శివసేన రెండు వర్గాలు పోటాపోటీగా విప్ జారీ చేశాయి. ఈ నెల 3న జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ గెలిచారు. అలాగే ఆ మరునాడు జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం షిండేకు అనుకూలంగా 164 మంది, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో బలపరీక్షలో సీఎం షిండే విజయం సాధించారు.
మరోవైపు విప్ను ధిక్కరించినందుకు రెబల్ గ్రూప్ చీఫ్ విప్, షిండే విధేయుడు భరత్ గోగావాలే, ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే పేరును అనర్హత వేటు జాబితాలో పేర్కోలేదు. కాగా, ఉద్ధవ్ వర్గం కూడా విప్ ధిక్కారం, ఫిరాయింపులపై ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో శివసేన ఇరు వర్గాలకు చెందిన 53 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ తెలిపారు. ‘ఏదైనా దరఖాస్తు వచ్చినప్పుడు, మేం దానిపై చర్యలు తీసుకుటాం. దీంతో ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకు నోటీసు జారీ చేశాం’ అని చెప్పారు.