న్యూఢిల్లీ/ఉదయ్పూర్, జూన్ 29: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన టైలర్ కన్హయ్యలాల్ దారుణ హత్య కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. కన్హయ్య హత్యను ఉగ్ర కిరాతకంగా పేర్కొన్న కేంద్రం.. దీని వెనుక ఏదైనా సంస్థ ఉందా అనే కోణంతో పాటు ఇతర అంతర్జాతీయ సంబంధాలపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)తో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. తమ మతాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో మత విద్వేష పోస్టు పెట్టాడని పేర్కొంటూ ఇద్దరు వ్యక్తులు కన్హయ్యలాల్ను కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
పోలీసుల అదుపులో మరో ముగ్గురు
రాజస్థాన్ పోలీసులు మంగళవారమే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రభావం ఉన్నదని ప్రాథమిక విచారణలో తేలిన నేపథ్యంలో హోంశాఖ ఎన్ఐఏ బృందాన్ని ఉదయ్పూర్కు పంపింది. నిందితుల్లో ఒకడికి పాకిస్థాన్కి చెందిన దవాత్-ఎ-ఇస్లామి అనే సంస్థతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. 2014లో కరాచీ కూడా వెళ్లాడని రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లథేర్ పేర్కొన్నారు.
ఈ హత్య కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ సంస్థకు భారత్లో కూడా శాఖలు ఉన్నాయి. కాగా, కన్హయ్యలాల్ హత్యను పలు ప్రముఖ ముస్లిం సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇది ఇస్లామిక్ వ్యతిరేకమని, ఏ వ్యక్తికి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఉలేమా-ఎ-హింద్ పేర్కొన్నాయి.