Sisters suicide : వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. కొన్ని గంటల్లో ఆ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. ఒకే పందిరి కింద అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు చూసేందుకు అప్పటికే బంధుమిత్రులంతా చేరుకున్నారు. పెళ్లి మండపం పరిసరాలు సందడి సందడిగా మారాయి. కానీ ఇంతలో ఘోరం జరిగింది. ఏమైందో ఏమోగానీ పెళ్లి కుమార్తెలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ జిల్లాలోని మనాయ్ గ్రామంలో గుండెను పిండేసే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఆత్మహత్యలకు పాల్పడ్డ పెళ్లి కుమార్తెలు శోభ (25), విమ్ల (23) ఇద్దరూ ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. శనివారం వారి పెళ్లిళ్లు జరగాల్సి ఉండటంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ ‘బంధోలి’ కార్యక్రమం సందడిగా సాగాయి. అయితే శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరూ పురుగుల మందు సేవించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే పరిశీలించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు ప్రకటించారు. దాంతో మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలో మృతుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అంత్యక్రియలను నిలిపేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మరో ఐదు నిమిషాలు ఆలస్యం జరిగి ఉంటే అంత్యక్రియలు పూర్తయ్యేవని జస్వంత్ సింగ్ చెప్పారు.
మృతదేహాలు నీలి రంగులోకి మారాయని, ఇది విష ప్రయోగంవల్ల జరిగిన ఆత్మహత్యేనని మృతుల మేనమామ ఆరోపించారు. బాధితుల బాబాయ్లు, ఈ పెళ్లిళ్ల విషయంలో తీవ్ర ఒత్తిడి తెచ్చారని, మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దుచేసి, బాబాయ్ల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పెళ్లిళ్లు నిశ్చయించారని చెప్పారు. ఈ బలవంతపు పెళ్లి ఇష్టంలేకనే తన మేనకోడళ్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
కాగా, పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టంలో వారి మరణానికి పురుగుల మందే కారణమని తేలింది. వారు పురుగుల మందు తాగినట్లుగా ఆధారాలు లభించాయి. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. దీనిపై కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు.