గువహటి : గువహటిలోని అసోం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్లో రాయల్ బెంగాల్ టైగర్ ఖాజీ మరో రెండు పులి పిల్లలకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీన రెండు పిల్లలకు జన్మనిచ్చినట్లు జూ అధికారులు వెల్లడించారు. రెండేండ్లలో ఖాజీ నాలుగు పులి పిల్లలకు జన్మనిచ్చింది. 2020, ఆగస్టు నెలలో సురేశ్, సుల్తాన్ అనే పులి పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా అసోం స్టేట్ జూలో రాయల్ బెంగాల్ టైగర్ పాపులేషన్ తొమ్మిదికి చేరింది.
ఖాజీతో పాటు తన ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్ డాక్టర్ ఆశ్విని కుమార్ పేర్కొన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ పులి పిల్లలకు వెచ్చదనం ఉండేలా జూ కీపర్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అమిత్ షాహి మాట్లాడుతూ.. ఖాజీకి మంచి పోషకాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 6 నుంచి 7 కేజీల మాంసాన్ని అందిస్తూ, వెటర్నరీ డాక్టర్లు సూచించిన ఆహారాన్ని కూడా ఇస్తున్నామని స్పష్టం చేశారు. జూలో జంతువులకు పరిశుభ్రమైన వాతావరణం అందించడంపై దృష్టి సారించామన్నారు. ఖాజీతో పాటు ఇద్దరు పిల్లలకు ఎలాంటి హానీ కలిగించకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నామని తెలిపారు. ఈ రెండు పులి పిల్లలకు త్వరలోనే నామకరణం చేయనున్నారు. అసోంలో పులుల సంఖ్య పెరిగింది. 2018లో 159 పులులు ఉంటే.. 2021 నాటికి ఆ సంఖ్య 200లకు చేరింది.