శ్రీనగర్: కరోనా మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతున్నది. దాంతో కరోనా రోగులను కాపాడాలంటే కృత్రిమ శ్వాస అందించడం అనివార్యంగా మారింది. కానీ సరిపడినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కరోనా బాధితులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు ఖర్చును భరించి వెంటిలేటర్లు సమాకూర్చుకుంటున్నా, నిరుపేదలు మాత్రం దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు.
ఈ క్రమంలో కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్గువ ధరకే లభించే ఒక పోర్టబుల్ వెంటిలేటర్ను తయారు చేశారు. వెంటిలేటర్ల కొరతను అధిగమించేందుకు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విద్యార్థులు సాజిద్ నూర్, జహంగీర్ తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వెంటిలేటర్ను అందుబాటులోకి తెచ్చారు. లాక్డౌన్ కారణంగా వీరిద్దరి ఇండ్లలో ఆర్థిక సమస్యలు ఉన్నా.. వెంటిలేటర్ తయారీ కోసం స్క్రాప్ మెటీరియల్తో ప్రయోగాలు ప్రారంభించి చివరికి విజయవంతమయ్యారు.
సాధారణ వెంటిలేటర్లలా కాకుండా ఈ పోర్టబుల్ వెంటిలేటర్ను సెన్సర్లు, మైక్రో కంట్రోలర్లతో అనుసంధానించారు. దీని ఆధారంగా ఈసీజీ, శరీర ఉష్ణోగ్రతను ఎక్కడి నుంచైనా పర్యవేక్షించవచ్చు. దీన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్ సహాయంతో మొబైల్కు అనుసంధానించి రోగి పరిస్థితిని మానిటర్ చేయవచ్చని సాజిద్, జహంగీర్ తెలిపారు. దీంతో వైద్యుల సహకారం పొందడం వీలవుతుందని పేర్కొన్నారు.
ఈ వెంటిలేటర్ను శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశీలించింది. కొవిడ్-19 ఓపెన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో ఇది మొదటి స్థానంలో నిలిచింది. దీని ధర రూ.20 వేల కంటే తక్కువేనని సాజిద్ తెలిపారు.