అన్ని వస్తువులపై జీఎస్టీ ఉందని తెలుసు.. కానీ, వాష్రూంను వినియోగించుకున్నందుకు కూడా జీఎస్టీ పడుతుందని మీకు తెలుసా? ఈ విషయం తెలియక ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో వాష్రూంను ఉపయోగించుకున్న ఇద్దరు విదేశీయులు షాక్ అయ్యారు. ఐదు నిమిషాలు మాత్రమే వాష్రూంను వినియోగించుకున్నందుకు జీఎస్టీతో కలిపి రూ. 224 చెల్లించారు. ఈ ఘటనపై వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన గైడ్ ఫిర్యాదు కూడా చేశాడు.
గతిమాన్ ఎక్స్ప్రెస్ నుంచి ఇద్దరు విదేశీ పర్యాటకులు ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో దిగారు. వారికి గైడ్ ఐసీ శ్రీవాస్తవ స్వాగతం పలికాడు. వారిద్దరూ బ్రిటిష్ ఎంబసీ నుంచి వచ్చారు. వాష్రూంకు వెళ్లాలని గైడ్ను అడగ్గా, స్టేషన్లో నిర్మించిన ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి తీసుకెళ్లాడు. ఐదు నిమిషాల తర్వాత వారు బయటకు వచ్చారు. రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి రూ. 224 బిల్లు వారి చేతిలో పెట్టింది. దీంతో వారిద్దరూ షాక్కు గురయ్యారు. ఒక్కొక్కరి బిల్లు రూ. 100. దానిపై జీఎస్టీ రూ. 12. అలా వారిద్దరికీ కలిపి రూ. 224 బిల్లు అయ్యిందని రిసెప్షనిస్ట్ వివరించింది. దీనిపై వారిద్దరితోపాటు గైడ్కూడా అభ్యంతరం వ్యక్తంచేశాడు. చివరికి అడిగినంతా ఇచ్చి బయటకు రావాల్సి వచ్చింది.
ఈ ఘటనపై గైడ్ శ్రీవాస్తవ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. జనరల్ కోచ్లో ఆగ్రా నుంచి ఢిల్లీకి టికెట్ రూ. 90 రూపాయలు మాత్రమేనని, కానీ, వాష్రూం వాడుకున్నందుకు రూ. 112 చార్జ్ చేస్తున్నారని మండిపడ్డాడు. సర్కారు ఓ వైపు అతిథి దేవోభవ అంటూనే మరోవైపు అతిథుల నుంచి పనికిమాలిన బిల్లులు వసూలు చేస్తున్నదని దుయ్యబట్టాడు. ఇదిలా ఉండగా, ఎగ్జిక్యూటివ్ లాంజ్లోకి ప్రవేశానికి ప్రత్యేక రుసుం ఉందని, దీనిపై జీఎస్టీ పడుతుందని ఐఆర్సీటీసీ ప్రతినిధి బ్రజేష్ కుమార్ తెలిపారు. లోపల టాయిలెట్తోపాటు నెట్ సౌకర్యం కూడా ఉందని, ఐదు నిమిషాలున్నా.. గంటసేపున్నా అదే చార్జ్ వర్తిస్తుందని వివరణ ఇచ్చారు.