షిమ్లా: అనాది కాలం నాటి ఆచారానికి హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని ఓ గ్రామం వేదికగా మారింది. హట్టి తెగకు చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో జరిగింది. షిల్లాయి గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే అన్నాదమ్ముళ్లు.. సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ ముగ్గురూ హట్టి తెగకు చెందినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. అయితే ఆ తెగలో ఇన్నాళ్ల వరకు ఆ వివాహ సంప్రదాయం చాలా గోప్యంగా జరిగేది. కానీ నేగి సోదరులు మాత్రం తమ పెళ్లిని ఘనంగా చేసుకున్నారు. శతాబ్ధాల క్రితం నాటి సంప్రదాయాన్ని నిలబెట్టినట్లు వాళ్లు చెప్పుకుంటున్నారు.
వివాహ వేడుకను అందరి అనుమతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. బహుభార్యత్వానికి సంబంధించిన ఈ వేడుకను ఆ గ్రామంలో చాలా గ్రాండ్గా చేపట్టారు. హట్టి వర్గ ప్రజల్లో ఉండే ఈ సంప్రదాయాన్ని జోడిధారణ లేదా ద్రౌపది ప్రాథ అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో అన్నాదమ్ముళ్లు ఒకే భార్యను షేర్ చేసుకుంటారు. సిర్మౌర్ జిల్లాల్లోని ఈ సంప్రదాయం ఇక్కడ ఆచారంగా మారింది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం కొనసాగుతున్నది. కుటుంబ ఐకమత్యాన్ని కాపాడేందుకు, పూర్వీకుల భూములను రక్షించుకునేందుకు, ఆ తెగ మహిళలు వితంతువులుగా ఉండకూడదని ఈ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు.
ప్రదీప్ నేగి ఆ రాష్ట్ర జలశక్తి శాఖలో పనిచేస్తున్నాడు. ఇక సోదరుడు కపిల్.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ దూరంగా పనిచేస్తున్నా.. సునీతాను మనువాడే విషయంలో ఆ ఇద్దరూ శాస్త్రాలను అనుసరించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రదీప్ తెలిపాడు. మా ఆచారాలను మేం ఫాలో అయ్యామని, ఎందుకంటే మా చరిత్ర పట్ల మాకు గర్వంగా ఉందన్నాడు. పారదర్శకతను తానేప్పుడూ నమ్ముతానని, నేను విదేశాల్లో ఉన్నా, మ్యారేజీ వల్ల భార్యకు సపోర్టు, సెక్యూర్టీ, ప్రేమ లభిస్తుందని కపిల్ తెలిపాడు. ఈ పెళ్లి తన ఇష్టప్రకారమే జరిగిందని, నన్ను ఎవరూ వత్తిడి చేయలేదని, ఈ ఆచారం గురించి తనకు తెలుసు అని, అందరం కలిసి ప్రతిజ్ఞ చేశామని, మా బంధంపై నాకు నమ్మకం ఉందని వధువు సునీత తెలిపింది.
మూడు రోజుల పాటు పెళ్లి వేడుకను వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు, బంధువులు ఆ పెళ్లికి హాజరయ్యారు. అతిథులకు స్థానిక ఆచారాల ప్రకారమే భోజనాలు పెట్టారు. పాహరి సంప్రదాయ పాటలు, నృత్యాలతో పెళ్లి వేడుకను ఎంజాయ్ చేశారు.