న్యూఢిల్లీ, జూలై 5: కేంద్రప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతున్నది. నూతన ఐటీ చట్టం ప్రకారం కంటెంట్ తొలగించాలని మోదీ సర్కారు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది జూన్లో జారీచేసిన ఉత్తర్వులు ఏకపక్షమని పేర్కొన్నది.
కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన కంటెంట్ను కూడా తొలగించాల్సి వస్తున్నదని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించినట్టేనని రిట్ పిటిషన్లో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం కంటెంట్ తొలగించాలని జారీచేసిన కొన్ని ఉత్తర్వుల్లో ఆ కంటెంట్ తొలగించడానికి ప్రాతిపదిక ఏమిటో చెప్పట్లేదని ఆరోపించింది. ఈ ఆదేశాలపై న్యాయసమీక్ష జరుపాలని కోరింది.
గత సంవత్సరంలో కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ట్విట్టర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. 2021 మే 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం అల్టిమేటం జారీచేసింది. ఫేస్బుక్, గూగుల్లు అందుకు అంగీకరించగా, ట్విట్టర్ మాత్రం వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నది. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం మొదలైంది. రైతు ఉద్యమానికి సంబంధించిన ట్వీట్లను తొలగించాలని కేంద్రం ఆదేశించగా అందుకు ట్విట్టర్ నిరాకరించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే జూలై 4లోగా ఐటీ నిబంధనలు పాటించాల్సిందేనని ట్విట్టర్ కేంద్రం చివరి వార్నింగ్ ఇచ్చింది.