న్యూఢిల్లీ, నవంబర్ 4: ట్విట్టర్లో ఎలాన్ మస్క్ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.
ఉద్యోగి ట్వీట్ వైరల్!
ట్విట్టర్ నుంచి తొలగిస్తున్నట్టు మెయిల్ అందుకున్న ఓ 25 ఏండ్ల యువకుడు కంపెనీ నుంచి తనను తొలగించడంపై సానుకూలంగా స్పందించాడు. ‘బర్డ్ యాప్ నుంచి ఇప్పుడే ఉద్వాసనకు గురయ్యా. ఇది గౌరవప్రదంగా భావిస్తున్నా. ఈ బృందంతో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నా. పనిచేసేచోటును ప్రేమిద్దాం. లవ్ ట్విట్టర్’ అంటూ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ట్వీట్ చేసిన గంటలోనే 3,300 మంది లైక్ చేశారు.