బెంగళూరు, సెప్టెంబర్ 26: గత ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా అనేక ఖాతాలను పూర్తిగా స్తంభింపజేయమని కేంద్రం ఆదేశించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కర్ణాటక హైకోర్టుకు నివేదించింది. ఖాతాల నిలుపుదలపై కేంద్రంజారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన కేసులో సోమవారం జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ధర్మాసనం ముందు వాదోపవాదాలు జరిగాయి. సీనియర్ న్యాయవాది అరవింద్ ఎస్ దాతర్ ట్విట్టర్ తరఫున వాదనలు వినిపించారు. కేంద్రం ఉత్తర్వులు ట్విట్టర్ యూజర్ల రాజ్యాంగ హక్కులను ఉల్లంగిస్తున్నాయని తెలిపారు.
కేవలం అభ్యంతరకరమైన ట్వీట్ను మాత్రమే తొలగించాలని, మొత్తంగా ఖాతాను స్తంభింపజేయొద్దని చట్టం చెప్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం బ్లాక్ చేయమంటున్న ట్వీట్లలో 50-60 శాతం ఎలాంటి హానీ చేయనివే ఉంటున్నాయని చెప్పారు. వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు రైతు ఆందోళనపై వార్తలు ప్రసారం చేస్తుంటే ఏమీ అనని కేంద్రం ట్విట్టర్ను మాత్రమే ఖాతాల నిలిపివేతకు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించడం వాక్స్వాతంత్య్రంలో భాగమేనని, చట్టం పరిధిలో విమర్శలు చేయొచ్చని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు.