న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: టీవీల దేశీయ తయారీదారులను ప్రోత్సహించే ఉద్దేశంలోభాగంగా కేంద్రం కస్టమ్ డ్యూటీని తగ్గించింది. దీంతో టీవీల ధరలు రూ.3 వేల వరకు తగ్గనున్నాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5 నుంచి 2.5 శాతానికి తగ్గించడంతో టీవీలు మరింత చౌక కానున్నాయి. టీవీల తయారీలో అతి ముఖ్యమైన ఒపెన్ సెల్స్పై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో టీవీల ధరలు ఐదు శాతం వరకు దిగివస్తాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఎల్ఈడీ టీవీ తయారీలో 60-70 శాతం ఒపెన్ సెల్ ప్యానెల్ కోసం ఖర్చు అవుతున్నది.
టీవీ తయారీ సంస్థలు వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలపై కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్స్ తయారీదారుల సంఘం ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ..ఈ నిర్ణయం దేశీయ టీవీల తయారీదారులకు ఊరటనిచ్చిందని అన్నారు.