Minister Keerthana : తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) లో సోమవారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న కీర్తన (Keerthana) ప్రమాణస్వీకారం మాత్రం నిలిచిపోయింది. ఆమె సాంకేతిక కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీలో ప్రమాణం చేసే సమయంలో తమ ‘ఎలక్షన్ సర్టిఫికెట్’ ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే మంత్రి కీర్తన ఆ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకురాకపోవడంతో ఆమె ప్రమాణస్వీకారాన్ని ప్రొటెం స్పీకర్ వాయిదా వేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీచేసే ఒరిజినల్ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తారు. అందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్న తరుణంలో.. ఒక మంత్రి ఇలాంటి కీలకమైన పత్రాన్ని మర్చిపోయి తీసుకురాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దాంతో ఎమ్మెల్యేగా మంత్రి కీర్తన ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా ఆగిపోయింది. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత ఆమె మరోసారి ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.