ముంబై: టీవీ నటి తునిషా శర్మ (21) మృతి కేసులో నిందితుడిగా ఉన్న షీజాన్ ఖాన్ను వాలివ్ పోలీసులు ఇవాళ మరోసారి వసాయ్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 24న తునిషా శర్మ షూటింగ్ సెట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సహ నటుడు షీజాన్ ఖానే ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని ఆరోపణలు వచ్చాయి.
దాంతో ఈ నెల 25న తెల్లవారుజామున వాలివ్ పోలీసులు షీజాన్ ఖాన్ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు ముందుగా అతనికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఆ తర్వాత కూడా పోలీసులు నిందితుడిని మరో రెండుసార్లు కోర్టులో హాజరుపర్చి కస్టడీ పొడిగింపు కోరారు. దాంతో రెండు సార్లు వరుసగా రెండు, మూడు రోజుల చొప్పున కోర్టు షీజాన్ కస్టడీని పొడిగించింది.
ఇవాళ్టితో చివరి మూడు రోజుల కస్టడీ కూడా ముగియడంతో పోలీసులు మరోసారి నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇప్పటికే పోలీసులు కేసుకు సంబంధించిన పలు వివరాలను షీజాన్ నుంచి రాబట్టారు. తునిషా, షీజాన్ల కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.