హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు దేశ రాజధాని ఢిల్లీలో ఓ శాశ్వత కార్యక్షేత్రం ఏర్పడనున్నది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మించనున్న టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం భూమిపూజ చేయనున్నారు. వసంత్ విహార్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1100 చదరపు మీటర్ల స్థలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు బుధవారం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణవ్యాప్తంగా గ్రామగ్రామాన గులాబీ జెండాను ఎగురవేసి జెండాపండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దేశంలోనే 60 లక్షల పైచిలుకు సభ్యత్వంతో బలమైన రాజకీయ శక్తిగా రూపొందిన గులాబీ దళం సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసుకొనేందుకు సిద్ధమవుతున్నది.
బలమైన నిర్మాణం
పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగా ఈ నెల 2 నుంచి 12 వరకు 10 రోజులపాటు గ్రామ/మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలను, 12 నుంచి 20లోపు మండల/మున్సిపాలిటీల్లో పట్టణ కమిటీలు వాటి అనుబంధ కమిటీలను, ఆ తరువాత జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను ఏర్పాటుచేయాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తమ జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
గ్రామ/వార్డుకు వంద.. మండలానికి 275 మంది
గ్రామ/వార్డు స్థాయిలో ఏర్పడే కమిటీలో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితోపాటు ఆరుగురు కార్యవర్గ సభ్యులతో కలిపి మొత్తం 11 మంది ఉంటారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 2,957 మున్సిపల్ వార్డుల్లో 11 మంది చొప్పున 1,43,726 మందికి పార్టీ పదవులు దక్కబోతున్నాయి. ఇప్పటికే ఉన్న 9 అనుబంధ సంఘాలకు తోడు ఈసారి కొత్తగా సోషల్ మీడియా కమిటీ వేయాలని పార్టీ నిర్ణయించింది. విద్యార్థి, కార్మిక, మహిళా, యువజన, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిటీలు వేరుగా ఏర్పడనున్నాయి. ప్రతీ కమిటీకి 9 మంది చొప్పున 90 మంది. అంటే ఒక గ్రామంలో లేదా వార్డులో 100 మందికి పదవులు రాబోతున్నాయి. అదేవిధంగా మండల/పట్టణ కమిటీల్లో 22 నుంచి 25 మందికి ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ లెక్కన ప్రతీ మండల/మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణ కమిటీల్లో (584 మండలాలు/142 పట్టణాల్లో) దాదా పు 4లక్షల మందికి (అనుబంధ కమిటీలతోసహా) పార్టీ పదవులు దక్కబోతున్నాయి. అదేవిధంగా 33 జిల్లా కమిటీలు, అన్ని జిల్లాల్లో 10 అనుబంధ కమిటీలు, రాష్ట్ర కమిటీ, దాని అనుబంధ కమిటీలు ఏర్పడనున్నాయి. వీటికితోడు జీహెచ్ ఎంసీ పరిధిలో దాదాపు 1400 పైచిలుకు బస్తీ కమిటీలు, అనుబంధ కమిటీలు వేయనున్నారు.
సామాజిక కూర్పునకు పెద్దపీట
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలు ప్రతిస్థాయి కమిటీల్లో 51 శాతానికి పైనే ఉండాలని, అలా లేని కమిటీలు చెల్లుబాటు కావని కేసీఆర్ స్పష్టం చేశారు.
లక్షల మందికి పదవులు
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీల్లోని 2,957 వార్డులు, జీహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ సహా 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 661 డివిజన్లు, 584 మండలాలు, 33 జిల్లాల్లో పార్టీ కమిటీలు, 10 అనుబంధ కమిటీలు (సోషల్ మీడియా కమిటీతో సహా) ఏర్పడనున్నాయి. వివిధ స్థాయిల్లో కమిటీలు వేయటం ద్వారా టీఆర్ఎస్ పార్టీలోని లక్షల మంది కార్యకర్తలకు పదవులు రాబోతున్నాయి.