న్యూఢిల్లీ : పార్లమెంట్లోని రాజ్యసభ లాబీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కలిశారు. రాజ్యసభ సభ్యులు కే కేశవరావు నేతృత్వంలో కలిసిన ఎంపీలు.. ధాన్యం సేకరణ అంశంపై పీయూష్ గోయల్ వద్ద ప్రస్తావించారు. ఈ అంశంపై మీతో చర్చించేందుకు నలుగురు మంత్రులు ఢిల్లీ వచ్చారని గోయల్కు ఎంపీలు వివరించారు. మంత్రులకు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వాలని గోయల్ను కేశవరావు కోరారు. రేపు షెడ్యూల్ చూసుకుని సమయం ఇచ్చేందుకు పరిశీలిస్తానని పీయూష్ గోయల్ కేకేకు తెలిపారు.
వన్ నేషన్–వన్ ప్రొక్యూర్మెంట్ నినాదంతో, పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన ఈ బృందంలో నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ఉన్నారు. మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నారు.