అగర్తల, ఫిబ్రవరి 15: అసెంబ్లీ ఎన్నికలకు త్రిపుర రాష్ట్రం సిద్ధమైంది. 60 సీట్లున్న ఈ ఈశాన్య రాష్ట్ర శాసనసభ ఎన్నికలు గురువారం నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న అధికార బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షేనని, ఈసారి గట్టెక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్టీ, లెఫ్ట్-కాంగ్రెస్ కూటములుగా ఏర్పడగా, రాజవంశానికి చెందిన తిప్ర మోత గట్టి పోటీదారుగా నిలిచారు. టీఎంసీ పోటీలో ఉన్నా దాని ప్రభావం నామమాత్రమే. రాష్ట్రంలో 3,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందని ముఖ్య ఎన్నికల అధికారి కిరణ్కుమార్ దినకర్రు తెలిపారు. రాష్ట్రంలో 28.13 లక్షల ఓటర్లుండగా, అందులో మహిళలు 13.53 లక్షలు. 259 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 20 మంది మహిళలున్నారు.
త్రిపురలో అధికార బీజేపీ 55 సీట్లలో పోటీలో ఉండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ కేవలం ఐదు సీట్లలో మాత్రమే బరిలో ఉంది. వామపక్ష కూటమిలో సీపీఎం 47 సీట్లలో, కాంగ్రెస్ 13 సీట్లలో పోటీపడుతున్నాయి. తిప్ర మోత 42 మంది అభ్యర్థులను రంగంలో ఉంచారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలలో, స్వతంత్ర అభ్యర్థులు 42 మంది పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుంది.