అగర్తలా: త్రిపుర రాష్ట్రంలో అధికార బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కాలంగా బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే గుడ్బై చెప్పారు. సీనియర్ నాయకుడు బుర్బా మోహన్ త్రిపుర (67) తన ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుర్బా మోహన్ 2018లో కర్బూక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను త్రిపుర అసెంబ్లీ స్పీకర్కు పంపించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలు తెలిపేందుకు ఆయన నిరాకరించారు. బీజేపీని వీడిన ఆయన ఇప్పుడు TIPRA (టిప్రహా ఇండిజనస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్) పార్టీలో చేరనున్నారు. బుర్బా మోహన్తోపాటు సీనియర్ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ గౌరశంకర్ రీంగ్ కూడా బీజేపీని వీడి TIPRAలో చేరేందుకు సిద్ధమయ్యారు.
బుర్బా మోహన్ త్రిపుర కంటే ముందు బీజేపీని వీడిన వారిలో అశీశ్దాస్, సుదీప్ రాయ్ బర్మాన్, అశీశ్ కుమార్ సాహా ఉన్నారు. అశీశ్దాస్ బీజేపీలోనే చేరగా.. బర్మాన్, సాహా ఇద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.