కోల్కతా: పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కర్, తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం నుంచీ ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ట్వీట్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా గవర్నర్ను అంకుల్ జీ అని పిలుస్తూ.. మహువా ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. మీరు గవర్నర్ జాబ్ వదిలి వెళ్లిపోయినప్పుడే బెంగాల్ బాగుపడుతుందని ఆమె ఓ ట్వీట్లో అన్నారు. ఆయనకు ఏ జాబ్ సూటవుతుందో కూడా కొన్ని సలహాలిస్తూ మరో ట్వీట్ చేశారు.
రాజ్భవన్లో తన బంధువులు ఆరుగురికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారని మహువా ఆరోపించారు. వాళ్లందరికీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోస్టులు ఇచ్చారని చెప్పారు. వాళ్ల పేర్లను కూడా ఆమె బయటపెట్టారు. దీనిపై స్పందించిన గవర్నర్ జగ్దీప్.. వాళ్లు తన బంధువులు కారని సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. వాళ్లంతా మూడు రాష్ట్రాలు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వాళ్లని, అందులో ఎవరూ తనకు సన్నిహితులు కారని స్పష్టం చేశారు.
దీనిపై మహువా వెంటనే స్పందించారు. వాళ్ల చరిత్ర ఏంటో, ఎవరు ఎలా రాజ్భవన్లోకి వచ్చారో వెంటనే చెప్పాలని ట్వీట్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు కూడా ఈ విషయంలో మీకు ఏ సాయం చేయలేరని మోయిత్రా అన్నారు. అంతేకాదు మీకు ఉపరాష్ట్రపతి పదవి కూడా దక్కుతుందని అనుకోవడం లేదంటూ ట్వీట్ చేశారు.