పనాజి: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఇటీవల చేరిన గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మమ్లేదార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ కంటే దారుణమైన పార్టీ టీఎంసీ అని, అది కమ్యూనల్ పార్టీ అని ఆరోపించారు. గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హిందువులు, క్రైస్తవుల మధ్య విభజనను సృష్టించేందుకు టీఎంసీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పోండా మాజీ ఎమ్మెల్యే అయిన మమ్లేదార్, సెప్టెంబర్ చివరి వారంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. గోవా నుంచి టీఎంసీలో చేరిన తొలి కొద్ది మంది నేతల్లో ఆయన కూడా ఒకరు. అయితే అనూహ్యంగా టీఎంసీకి శుక్రవారం రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో మమ్లేదార్ మీడియాతో మాట్లాడారు. ‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ పనితీరుతో నేను పూర్తిగా ఆకర్షితుడై టీఎంసీలో చేరాను. టీఎంసీ చాలా సెక్యులర్ పార్టీ అనే భావనలో ఉన్నాను. కానీ గత 15-20 రోజులుగా నేను గమనించిన దాని ప్రకారం, అది బీజేపీ కంటే ఘోరంగా ఉందని నాకు తెలిసింది’ అని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా క్రిస్టియన్ ఓట్లు టీఎంసీకి, హిందూ ఓట్లు ఎంజీపీకి వెళ్లాలని కోరుకుంటున్నారని మమ్లేదార్ విమర్శించారు. టీఎంసీ మతతత్వ పార్టీ అని, ఇది సెక్యులర్ ఫ్యాబ్రిక్కు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గృహలక్ష్మి పథకం పేరుతో ప్రజల డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కాగా, 2012-17 మధ్య మమ్లేదార్ ఎమ్మెల్యేగా ఉన్న మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ)తో టీఎంసీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీలో చేరిన కొన్ని రోజుల్లోనే ఆ పార్టీని ఆయన వీడారు.