కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల తొలి రోజున సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపేసి, సభ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా టీఎంసీ ఎమ్మెల్యేలు గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనల మధ్య తాను ప్రసంగం చేయలేనని గవర్నర్ జగదీప్ ధంఖర్ చెప్పారు. సీఎం మమతా, టీఎంసీ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు తన ప్రసంగంలోని మొదటి, చివరి వ్యాఖ్యలను చదివి సభ నుంచి గవర్నర్ వెళ్లిపోయారు. బెంగాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలపై బీజేపీ సభలో ఆందోళనకు దిగింది.
అయితే ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగి, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుపడ్డారని ఆరోపించారు. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు గంటకు పైగా ఆందోళనలు చేసినప్పటికీ తాము ఓపికతో ఉన్నామని తెలిపారు. స్పీకర్ అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. తాను కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశానని మమత పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ డ్రామా అని కోపోద్రిక్తులయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి అవమానం కలిగించే విధంగా ఉందన్నారు.