భారత రత్న లతా మంగేష్కర్కు ఘనమైన నివాళి ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ సర్కార్ నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించుకుంది మమతా బెనర్జీ ప్రభుత్వం. రాష్ట్రంలో 15 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, సార్వజనీన స్థలాల్లో లతా మంగేష్కర్ పాడిన పాటలను ప్లే చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా గాన కోకికలకు ఘనమైన నివాళులు అర్పించిన వారమవుతామని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు లతా మంగేష్కర్ మృతికి సంతాప సూచకంగా సోమవారం ఒంటిపూట సెలవును ప్రకటించింది.
గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూశారు. జనవరి 8 న ఆమె కరోనా బారినపడ్డారు. గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం కాస్త మెరుగైందని వార్తలొచ్చాయి. అంతలోనే ఆరోగ్యం విషమించి, తుది శ్వాస విడిచారు. పలు అవయవాల వైఫల్యం వల్ల లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.