భోపాల్: ఒక గిరిజన వ్యక్తిపై నమోదైన తప్పుడు కేసులో సుమారు రెండేళ్ల పాటు జైలులో ఉన్నాడు. అయితే తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జైలు నుంచి విడుదల అయిన అతడు శృంగార జీవితం, జీవనోపాధి, ఆరోగ్యం కోల్పోవడంపై ప్రభుత్వంపై ఏకంగా పది వేల కోట్లకుపైగా దావా వేశాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2018 జూలై 20న 35 ఏళ్ల కాంతు, అలియాస్ కాంతిలాల్ భీల్తోపాటు మరో వ్యక్తిపై మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడ్ని 2020 డిసెంబర్ 23న అరెస్ట్ చేశారు. దీంతో అతడు నాటి నుంచి జైల్లో ఉన్నాడు.
కాగా, నేర నిరూపణకు తగిన ఆధారాలను పోలీసులు కోర్టు ముందు ఉంచలేదు. దీంతో కాంతుతోపాటు మరో వ్యక్తిని నిర్దోషులుగా పేర్కొంటూ గత ఏడాది అక్టోబర్ 10న కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన కాంతు, తప్పుడు కేసులో సుమారు రెండేళ్లపాటు జైలులో ఉంచడంపై మండిపడ్డాడు. ప్రభుత్వంపై ఏకంగా పది వేల కోట్లకు దావా వేశాడు. తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, వృద్ధురాలైన తల్లి చాలా బాధను అనుభవించారని అందులో పేర్కొన్నాడు.
జైలులో తనకు చర్మ వ్యాధి సోకిందని, తన ఆరోగ్యం పాడైందని కాంతు ఆరోపించాడు. కుటుంబ జీవితం, మానవులకు దేవుడు ఇచ్చిన లైంగిక ఆనందంతోపాటు జీవనాధారం, కీర్తిని కోల్పోవడం, శారీరక హాని, మానసిక నొప్పిని భరించడం వంటి ఒక్కో కారణానికి కోటి పరిహారం చొప్పున మొత్తం పది వేల కోట్లకుపైగా నష్టపరిహారం కోరాడు.