నోయిడా : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93-ఏలో అక్రమంగా నిర్మించిన సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం ఆదివారం ట్రయల్ బ్లాస్ట్ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ సమయంలో బేస్మెంట్తో పాటు 13వ అంతస్తులోని ఆరు పిల్లర్లలో సుమారు నాలుగు కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఈ ట్విన్ టవర్స్ను మే 22న కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేయనున్నారు.
ఇవాళ జరిగి ట్రయల్ బ్లాస్ట్తో ఎంత మేరకు వైబ్రేషన్స్ వచ్చాయి? శబ్ద కాలుష్యం ? ఎంత మేరకు పేలుడు పదార్థాలు వాడారు? తదితర అంశాలపై నివేదిక పది రోజుల్లో రానున్నది. ట్రయల్స్ సందర్భంగా వైబ్రేషన్స్ టెస్ట్ కోసం ఆరు చోట్ల ప్రత్యేకంగా మిషన్లను అమర్చారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాకు చెందిన కంపెనీ జెట్ డెమోలిషన్ అధికారి మాట్లాడుతూ టవర్ అనుకున్నదానికంటే ఎక్కువగానే బలంగా ఉందన్నారు.
భవనం కూల్చివేతకు ఎక్కువగా పేలుడు పదార్థాలు అవసరమవుతాయన్నారు. ఇదిలా ఉండగా.. ట్రయల్ బ్లాస్ట్ సందర్భంగా సివిల్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. కాలుష్యాన్ని పరిశీలించేందుకు సైతం ప్రత్యేకంగా మిషన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఐఐటీ చెన్నై, సీబీఆర్ఐ, నోయిడా అధికారుల పర్యవేక్షణలో ట్రయల్స్ నిర్వహించారు.
బ్లాస్టింగ్ సమయంలో రహదారిని మూసివేయడంతో పాటు ట్రాఫిక్ను మళ్లించారు. భవనం చుట్టుపక్కల ఉన్న వారందరినీ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, టవర్లను కూల్చివేసేందుకు రూ.17.55 కోట్లు ఖర్చు కానుండగా.. శిథిలాలను తొలగించేందుకు మరో రూ.13.35కోట్లు ఖర్చు కానున్నది. టవర్ల కూల్చివేత కోసం సూపర్ టెక్ కంపెనీ ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నది.