Gujarat Earthquake | గుజరాత్ (Gujarat) రాష్ట్రాన్ని స్వల్ప భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3:21 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో రాజ్కోట్ (Rajkot) ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రాజ్కోట్(Rajkot) కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా, ఆ రాష్ట్రాన్ని సోమవారం ఉదయం మరో రెండు భూకంపాలు వణికించాయి.
కచ్ (Kutch), అమ్రేలి (Amreli) ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం (Earthquake) తీవ్రత రిక్టరు స్కేలు (Richter Scale)పై 3.8, 3.3 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కచ్ (Kuch) జిల్లాలో ఉదయం 10.49 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. లఖ్పట్ టౌన్ (Lakhpat town)కు 62 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. రెండోది అమ్రేలి (Amreli) జిల్లాలో ఈ తెల్లవారుజామున 1:42 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. మిటియాల గ్రామ (Mitiyala village ) సమీపంలో 7.1 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం ధాటికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే, వరుస భూకంపాలతో గుజరాత్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అమ్రేలిలో గత వారం రోజుల్లోనే 3.1, 3.4 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించడం ఇది ఐదోసారి. సౌరాష్ట్ర ప్రాంతంలో అమ్రేలి ఉంది. ఈ ప్రాంతంలో గత రెండేండ్లలో సుమారు 400 తేలికపాటి ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని ‘ఎర్త్క్వేక్ స్వార్మ్’ (Earthquake Swarm) గా చెబుతుంటారు. స్వార్మ్ అంటే ఓ సమూహం. చాలా చిన్న భూకంపాల శ్రేణిగా పరిగణిస్తారు. ప్రకంపనల తీవ్రత చాలా స్వల్పకాలమే ఉంటుంది. అయితే, రోజులు, వారాలు, కొన్నిసార్లు నెలల తరబడి కొనసాగుతుంటాయి. సహజంగా ఒకే ప్రాంతంలో ఇవి చోటుచేసుకుంటుంటాయి.
కాగా, 2001 సంవత్సరంలో కచ్ (Kutch) జిల్లాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఆ ప్రకృతి ప్రకోపానికి సుమారు 13,800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 1.67 లక్షల మంది గాయపడ్డారు. భారీ భూకంపం ధాటికి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.