తిరువనంతపురం: ఒక శిక్షణ విమానం రన్వే పై పల్టీలు కొట్టింది. అనంతరం రన్వేకు సమీపంలో తలకిందులుగా పడింది. అయితే అందులోని పైలట్ సేఫ్గా బయటపడ్డాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఒక్కరే ప్రయాణించే సెస్నా 172ఆర్ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ రన్వే నుంచి టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే ఆ చిన్న విమానం రన్వే పై పల్టీలు కొట్టింది. అనంతరం రన్వేకు సమీపంలోని ఖాళీ ప్రాంతంలో తలకిందులుగా పడింది.
కాగా, దీనిని గమనించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్పందించారు. విమానం పడిన ప్రాంతానికి వెళ్లారు. ఆ ఫ్లైట్కు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులోని పైలట్ను సేఫ్గా బయటకు తీశారు. 34 ఏళ్ల అనూప్ నాయర్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో గంట వరకు విమాన సేవలను నిలిపివేశారు. అలాగే మూడు కమర్షియల్ ఫ్లైట్లు ఆలస్యమైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపి డీజీసీఏకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు. కాగా, శిక్షణ విమానం తలకిందులుగా పడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.