న్యూఢిల్లీ, మే 16: కరోనా సాకు చూపి గత రెండేండ్లుగా రైళ్లలో సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం రాయితీని నిలిపివేసింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగైనా రాయితీని పునరుద్ధరించలేదు. దీంతో గత రెండేండ్లలో వృద్ధులపై రూ.1,500 కోట్ల భారం పడింది. మధ్యప్రదేశ్కు చెందిన సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 మధ్య రైళ్లలో 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ప్రయాణించారు. వీరి ద్వారా రైల్వేకు మొత్తంగా రూ.3,464 కోట్ల ఆదాయం సమకూరింది. రాయితీకి మంగళం పాడడంతో రైల్వే రూ.1,500 కోట్లు అదనంగా రాబట్టుకుంది. కరోనా కారణంగా 2020 మార్చిలో రాయితీలు నిలిపివేసింది. అయితే సర్వీసులు సాధారణ స్థితికి వచ్చినందున రాయితీ పునరుద్ధరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేంద్రం పునరుద్ధరించే అవకాశాలు లేవని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.