రత్నగిరి: కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికులకు నిప్పపెట్టి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు సంయుక్తంగా గాలించి అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి మహారాష్ట్ర (Maharashtra) లోని రత్నగిరి రైల్వే స్టేషన్ (Ratnagiri Railway Station) లో షారూఖ్ పట్టుబడ్డాడు.
గత ఆదివారం రాత్రి 9.45 గంటల సమయంలో షారూఖ్ సైఫీ అలప్పుజ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలులో తోటి ప్రయాణికులపై మండే స్వభావం కలిగిన ద్రవపదార్థం చల్లి నిప్పుపెట్టాడు. రైలు కోజికోడ్ సిటీని దాటి కోరపుఝ రైల్వే బ్రిడ్జికి చేరుకోగానే నిందితుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం కదులుతున్న రైలులోంచే కిందకు దూకి పారిపోయాడు.
ఘటన అనంతరం కొన్ని గంటలకు రైల్వే పోలీసులు తనిఖీ చేయగా కోజికోడ్లోని ఏల్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏడాది వయసున్న ఒక బాలుడు, ఒక మహిళ సహా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఎనిమిది మంది తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సైఫీ కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి రత్నగిరి సివిల్ ఆస్పత్రిలో నిందితుడి లొకేషన్ ట్రేస్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర పోలీసులు అక్కడికి వెళ్లి ఎంక్వయిరీ చేయగా.. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ సగంలోనే పారిపోయాడని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. వెంటనే రత్నగిరి రైల్వే స్టేషన్కు వెళ్లి చూడగా అక్కడ నిందితుడు పట్టుబడ్డాడు.
ప్రస్తుతం రత్నగిరిలోని రైల్వే పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నాడు. అయితే, నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కేరళ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత మహా పోలీసులు నిందితుడిని కేరళ పోలీసులకు అప్పగించనున్నారు. ప్రయాణికులకు నిప్పుపెట్టిన అనంతరం రైలు నుంచి కిందకు దూకినప్పుడు సైఫీ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
అయితే, తనకుతానుగా ఈ ఘటనకు పాల్పడలేదని, రైలులోకి ఎక్కి ప్రయాణికులకు నిప్పుపెట్టమని తనకు వేరే వాళ్లు చెప్పారని నిందితుడు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. దాంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.