న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాలకు కత్తెర వేసేలా కొత్త టెలికం బిల్లు ఉన్నదని బ్రాండ్బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లుపై సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొన్నది.
‘ప్రస్తుతం దేశంలో భారీ స్థాయిలో వృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థకు సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ, బిల్లుతో వాటికి గండి పడుతుంది’ అని పేర్కొన్నది. ట్రాయ్ అధికారాలకు కత్తెర వేసి 1997కు ముందు ఉన్న పరిస్థితులకు తీసుకెళ్లేలా బిల్లు రూపకల్పన జరిగిందని విమర్శించింది. ఇలాంటివి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ట్రాయ్ స్వతంత్రతను దెబ్బ తీస్తాయని బీఐఎఫ్ అధ్యక్షుడు టీవీ రామచంద్రన్ విమర్శించారు.