జబల్పూర్ : మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ క్రూయిజ్ బోట్ జబల్పూర్ సమీపంలోని నర్మదానదిపై బర్గీ డ్యామ్లో బోల్తాపడిన ఘటనలో మృతదేహాల వెలికితీతలో పలు విషాద దృశ్యాలు కన్పించాయి. గురువారం భారీ ఈదురుగాలుల కారణంగా 30 మందితో వెళ్తున్న బోట్ బోల్తాపడిన ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
ఒక మహిళ, తన నాలుగేండ్ల కుమారుడిని గుండెలకు హత్తుకుని ఉండగా, ఇద్దరికీ ఒకే లైఫ్ జాకెట్తో బిగించి ఉన్న స్థితిలో ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ బృందాలు శుక్రవారం వెలికితీశాయి. తన కుమారుడిని కాపాడటానికి చివరి క్షణం వరకు ఆ తల్లి ప్రయత్నించినట్టు తల్లీ బిడ్డల మృతదేహాలను చూస్తే తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో పర్యాటక శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించిందని, బోట్లోని ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని, ప్రమాదం సంభవించిన తర్వాత ఇవ్వడం ప్రారంభించారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు.