గాంగ్ టక్: సేంద్రీయ వ్యవసాయం, ఔషధ వ్యవస్థల వంటి సంప్రదాయ విజ్ఞాన రంగంలో పరిశోధనలను మరింత ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం విషయంలో అగ్రగామిగా నిలిచిన సిక్కిం రాష్ట్రాన్ని అభినందించిన ఆయన.. పాఠశాలల్లో వృత్తి శిక్షణను ప్రారంభించి పాఠ్యప్రణాళికలో మార్పులు చేయడం ప్రశంసనీయమన్నారు.
సిక్కిం పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి కాంచన్ గంగ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈశాన్య భారతంలో అభివృద్ధిని వేగవంతం చేయడంలో విశ్వవిద్యాలయాల పాత్రను నొక్కి చెప్పారు.
ఆలోచన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, అదే సమయంలో చేతలు స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పర్యాటకం, ఉద్యానరంగం, హస్తకళల వంటి విషయాల్లో ఈ ప్రాంతంలోని సహజ బలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మారుతున్న మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఆవిష్కరణలు ఉండాలన్నారు. స్థానిక, ప్రాంతీయ భాషల్లో నాణ్యమైన డిజిటల్ కంటెంట్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, ముఖ్యంగా ఉన్నత విద్య విషయంలో ఈ చొరవ మరింత పెరగాలని సూచించారు.
అనంతరం ఉక్రెయిన్ నుంచి వచ్చిన సిక్కిం విద్యార్థి బృందంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య కొద్ది సేపు సంభాషించారు. సిక్కిం రాజ్భవన్ ప్రాంగణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం సిక్కిం గవర్నర్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, రాష్ట్ర మంత్రులు కేఎన్ లెప్చా, బీఎస్ పంత్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.