చెన్నై: దక్షిణ రైల్వేలో పరిధిలోని రైల్వే పోస్టులకు సంబంధించిన పరీక్షలను స్థానికంగా నిర్వహించకుండా ఉత్తర భారతదేశంలో నిర్వహించడంపై తమిళనాడుకు చెందిన థాంథై పెరియార్ ద్రవిడర్ కజగం (టీపీడీకే) కార్యకర్తలు నిరసన తెలిపారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద గురువారం ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఎన్టీపీసీ సీబీటీ-2ను ఈ నెల 9, 10 తేదీల్లో ఆర్ఆర్బీ నిర్వహిస్తోందని దక్షిణ రైల్వే చెన్నై సీపీఆర్వో బీ గుగనేశన్ తెలిపారు. తమిళనాడు అభ్యర్థులను పరీక్ష కోసం జమ్ముకశ్మీర్ లేదా మరే ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. తమిళనాడు అభ్యర్థులకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో వసతి కల్పించినట్లు తెలిపారు.
మరోవైపు ఎన్టీపీసీ సీబీటీ-2ను రైల్వేబోర్డు ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారని గుగనేశన్ తెలిపారు. అందుకే కొంత మంది అభ్యర్థులను తమిళనాడు నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలించాల్సి వచ్చిందన్నారు. కేవలం చెన్నై మాత్రమే కాదని, మొత్తం 21 ఆర్ఆర్బీలు ఈ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.