మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోగల తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన యూనిట్లో ఆదివారం ఉదయం విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఊపిరాడక కొందరు కుప్పకూలిపోగా, వారిని దవాఖానకు తరలించారు.
డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ తయారు చేసే కంపెనీ ప్లాంట్లో ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ వివేకానంద్ కదమ్ తెలిపారు. గ్యాస్ లీకేజీ కారణంగా యూనిట్లో ఉన్న కార్మికులు స్పృహ కోల్పాయారని పేర్కొన్నారు. మృతిచెందిన కార్మికుడిని భగవత్ చౌపాల్ (22)గా గుర్తించినట్లు అధికారి తెలిపారు. మరో నలుగురిని సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. విషయం తెలుసుకున్న ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ డైరెక్టరేట్ అధికారులు.. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్తో కలిసి ప్లాంట్కు చేరుకున్నారని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారని కదమ్ వెల్లడించారు.