Kerala Video : కేరళలో బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక బస్సు.. స్కూటర్ను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఆగష్టు 27, గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎర్నాకుళం జిల్లాలోని, కక్కూర్ సమీపంలో కూతట్టుకుళాం-పిరవోమ్ రోడ్డుపై జరిగింది.
ఒక ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో వివాహ వేడుకకు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు వేగంగా వెళ్తున్నప్పడు, ముందు వెళ్తున్న ఒక స్కూటర్ అనుకోకుండా అడ్డువచ్చింది. దీంతో ఆ స్కూటర్ను తప్పించబోయిన బస్సు దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లి, బోల్తాపడింది. బస్సు అలాగే వెళ్లుంటే ఆ స్కూటరిస్టును ఢీకొనేది. అతడిని తప్పించే క్రమంలో, వేగంగా ఉండటం వల్ల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్తానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.
🚨 KERALA | TOURIST BUS OVERTURNS AFTER SWERVING TO AVOID SCOOTER
A tourist bus carrying a wedding party overturned after the driver reportedly swerved to avoid a scooter near Kakkoor in Koothattukulam, Ernakulam, Kerala.
The bus lost control and crashed into the side of a… pic.twitter.com/OBvWCm4frU
— contentkikamii (@contentkikamii) August 27, 2026
బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని కూతట్టుకుళాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పైర్, రెస్క్యూ సర్వీసెస్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత కొందరు స్పృహ తప్పిపడిపోగా, వారికి చికిత్స అందించారు.
ఈ ఘటనలో బస్సు వేగంగా వెళ్లడమే డ్రైవర్ ప్రధాన నిర్లక్ష్యంగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా స్కూటర్ను పక్కకు తిప్పిన స్కూటరిస్టుపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక, బస్సు పెట్రోల్ బంకులోకి చొచ్చుకెళ్లినప్పటికీ అక్కడి పోల్కు తగిలి ఆగిపోయింది. అలా కాకుండా లోపలివైపు దూసుకెళ్లుంటే, పెట్రోల్ కారణంగా భారీ ప్రాణ నష్టం జరిగేది.