న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ర్టాలు, ఇతరుల భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధిని ‘మిషన్ మోడ్’తో చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కనీసం 50 పర్యాటక కేంద్రాలను ఇంటిగ్రేటెడ్, ఇన్నోవేటివ్ పద్ధతులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ‘దేఖో అప్నా దేశ్’ పథకం కింద అంతర్జాతీయ, దేశీయ పర్యాటకులను ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతామని ప్రకటించారు. రాష్ట్రానికి ఒక జిల్లా, ఒక ఉత్పత్తి, హస్తకళా ఉత్పతులను ప్రోత్సహించడానికి యూనిట్ మాల్ ఏర్పాటుతోపాటు రవాణా సౌకర్యాలు, పర్యాటకుల భద్రత, గైడ్లు, ఉన్నతశ్రేణి హోటళ్లు లాంటి సౌకర్యాల కోసం పూర్తి ప్యాకేజీ అందిస్తామని చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి ‘వైబ్రంట్ విలేజేస్’ కార్యక్రమం కింద మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు. పర్యాటకరంగంలో యువతకు అపారమైన అవకాశాలు ఉంటాయని, ఇందుకు ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యంతో అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. కాగా, దేశంలో పర్యాటకుల రాకను ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీలోని తన కార్యాలయంలో విజిట్ ఇండియా 2023 ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.