బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకు అవమానం జరిగినట్లు ఒక మహిళ ఆరోపించింది. సెక్యూరిటీ తనిఖీ సందర్భంగా తన చొక్కాను విప్పించారని మహిళా సంగీత కళాకారిణి వాపోయింది. ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మంగళవారం సాయంత్రం ట్విట్టర్లో పేర్కొంది. ‘భద్రతా తనిఖీ సమయంలో బెంగళూరు విమానాశ్రయంలో నా చొక్కా తొలగించమని అడిగారు. ఒక మహిళ ఎప్పుడూ ఎదుర్కోని విధంగా అడగటంతో కేవలం పైన వేసుకునే లోదుస్తులతో ఉన్నాను. బెంగళూరు ఎయిర్పోర్ట్లోని భద్రతా తనిఖీ వద్ద ఆ విధంగా నిలబడడం నిజంగా అవమానకరం. బట్టలు తొలగించాలని మహిళను ఎందుకు అడుగుతారు?’ అని అందులో వాపోయింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది చర్యను నెటిజన్లు తప్పుపట్టారు.
కాగా, ఆ మహిళ ట్వీట్పై బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పందించింది. ‘ఇలా జరుగకూడదు. మా వల్ల జరిగిన అవాంతరానికి చాలా చింతిస్తున్నాం. ఈ అంశాన్ని మా కార్యకలాపాల బృందం, సీఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకెళ్లాం. మిమ్మల్ని సంప్రదించే వివరాలు అందజేస్తే మా బృందం త్వరగా సంప్రదిస్తుంది’ అని ట్విట్టర్లో బదులిచ్చింది. అయితే బుధరం ఉదయం ఆ మహిళ ట్వీట్తోపాటు ఆమె ట్విట్టర్ ఖాతాను కూడా తొలగించారు.