న్యూఢిల్లీ, మార్చి 30: పన్ను చెల్లింపుదారులు తమ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్ సంఖ్యతో అనుసంధానించేందుకు తుది గడువు గురువారంతో ముగియనున్నదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. గడువు దాటిన తర్వాత అనుసంధానం చేసేవారికి రూ.1000 వరకు జరిమానా విధిస్తామని వెల్లడించింది. గడువు ముగిసిన మూడు నెలల వరకు అంటే 2022 జూన్ 30వరకు అనుసంధానించే వారికి రూ.500, ఆ తర్వాత చేసేవారి నుంచి రూ.1000 రుసుమును జరిమానాగా వసూలు చేస్తామని తెలిపింది.
ఐటీఆర్ ఫైలింగ్ అవసరాల కోసం ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులను 2023 మార్చి వరకు యాక్టివ్లోనే ఉంచుతున్నట్టు ఆదాయపు పన్ను శాఖ బుధవారం తెలిపింది. ఆధార్-పాన్ అనుసంధానానికి ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ https://eportal.incometax.gov.in/ లేదా https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ లో లాగిన్ కావాల్సి ఉంటుంది.