మరో మూడు నెలల్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలకు పదునుపెట్టాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలతో ఎన్నికల సమరాంగణాన్ని పూరించాయి. అయితే, 2007లో యూపీ ఎన్నికల్లో వినూత్న వ్యూహాలు అమలుపర్చి.. నూతన ఒరవడిని సృష్టించిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వార్తల్లోనే లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను సమర్థంగా నిర్వహించలేకపోయిన బీఎస్పీని కాదని దళితులు, వెనుకబడిన వర్గాలు, ముస్లింలు రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీల వైపునకు మొగ్గు చూపనున్నట్టు విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.
ఎస్పీ వైపునకే..
వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నువ్వా-నేనా అనే రీతిన తలపడనున్నట్టు ఏబీపీ-సీవోటర్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ప్రజామద్దతు పెరుగుతుండటంతో ఎన్నికల నాటికి ఎస్పీ లీడ్లోకి వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేసింది. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి 21 శాతం ఓటింగ్ షేర్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ 34 శాతం ఓటు షేరు సాధించనున్నట్టు సర్వే పేర్కొంది. ఇదే సమయంలో.. 2017లో బీఎస్పీకి 22 శాతం ఓట్లు రాగా, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు షేరు 13 శాతానికి పడిపోనున్నట్టు సర్వే అంచనా వేసింది. 2017కు.. ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ ఓటు షేరింగ్లో పెద్దగా మార్పు లేనట్టు సర్వే తెలిపింది. అంటే, వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ ఓటు బ్యాంకు.. గంపగుత్తగా ఎస్పీకి తరలిపోతున్నట్టు అర్థమవుతున్నది. సునిశిత విమర్శలతో యోగి సర్కారును ఇరకాటంలో పెడుతున్న అఖిలేశ్ వైపునకే రాష్ట్రంలోని 22 శాతం దళితులు, 20 శాతం ముస్లింలు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తక్కువ మొత్తంలో కాంగ్రెస్ వైపునకు కూడా మొగ్గు చూపొచ్చని అభిప్రాయపడ్డారు.
అప్పుడు దిట్ట.. మరి ఇప్పుడు..
1984లో కాన్షీ రామ్ బీఎస్పీని స్థాపించారు. దళితులకు రాజ్యాధికారం నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన బీఎస్పీ.. అనతి కాలంలోనే ఇతర వర్గాలకు కూడా చేరువైంది. అలా 1993 ఎన్నికల్లో 11.12 శాతం ఉన్న ఓటు షేర్.. 2007కు వచ్చే నాటికి 30 శాతం దాటింది. 2007 ఎన్నికల సందర్భంగా.. అగ్రవర్ణాల ఓటు బ్యాంకు కోసం ‘ప్రబుద్ధ్ సమాజ్ గోష్ఠీ’ సభల పేరిట బీఎస్పీ వేసిన ‘సోషల్ ఇంజినీరింగ్’ ప్రణాళిక విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలోని 22 శాతం దళితుల ఓట్లు, ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లతో పాటు, 11 శాతం వాటా ఉన్న అగ్రవర్ణాల ఓట్లు కూడా బీఎస్పీ ఖాతాలో చేరాయి. ముస్లింలు కూడా బీఎస్పీ వైపునకే మొగ్గు చూపారు. దీంతో ఆ ఎన్నికల్లో 403 సీట్లకు గానూ 206 సీట్లను (30 శాతం ఓట్లు) గెలిచి మాయావతి అధికారంలోకి వచ్చారు. అయితే, అనంతరం.. వ్యవస్థీకృత పొరపాట్లు, ముందుచూపు లేకపోవడంతో క్రమంగా బీఎస్పీ చతికిలపడటం ప్రారంభించింది. 2012లో 26 శాతంగా ఉన్న ఓటు షేరు.. 2017లో 22 శాతానికి తగ్గిపోయింది.
బీఎస్పీ వెనుకబడటానికి కారణాలేంటి?
2017లో ఓటింగ్ షేర్
బీజేపీ+ 40 శాతం
ఎస్పీ+ 21 శాతం
బీఎస్పీ 22 శాతం
కాంగ్రెస్ 6 శాతం
ఇతరులు 11 శాతం
ఏబీపీ తాజా సర్వే
బీజేపీ+ 40 శాతం
ఎస్పీ+ 34 శాతం
బీఎస్పీ 13 శాతం
కాంగ్రెస్ 7 శాతం
ఇతరులు 6 శాతం