హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి బ్యాంకులు రూ.2000 నోట్ల(Rs 2,000 Notes)ను వెనక్కి తీసుకుంటున్న విషయం తెలిసిందే. 20 వేల వరకు వెంటనే క్యాష్ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ ఎక్కువ మొత్తం ఉన్నవారు.. తమ అమౌంట్ను బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే రూ.2000 నోట్ను బ్యాంక్లు తీసుకోనున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అధికార వర్గాల ద్వారా ఓ కొత్త విషయం తెలిసింది. సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత.. రూ.2000 నోట్ను ఆర్బీఐ కేంద్రాలు మాత్రమే వెనక్కి తీసుకుంటాయని తెలుస్తోంది.
సెప్టెంబర్ 30 తర్వాత బ్యాంకులు ఆ నోట్లను తీసుకోవని సమాచారం ఉంది. డెడ్లైన్ ముగిసిన తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆర్బీఐ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2వేల నోటు చెలామణిలోనే ఉన్నా.. దాన్ని బ్యాంకులు తీసుకోవని, కానీ మార్పిడి కోసం ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందని భావిస్తున్నారు. లీగల్ టెండర్ స్టేటస్ ఉందంటే.. దాని ఉద్దేశం 2వేల నోట్ను పూర్తి స్థాయిలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే రెండు వేల నోటు ఇస్తే, దాని విలువకు తగ్గ ఇతర అమౌంట్ను ఇస్తారు.