న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తుండటంతో దీని కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్ కు సంబంధించి జూన్ నాటికి 15 నుంచి 16 లక్షల వయల్స్ ఉత్పత్తి, సమీకరణ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
వీటిలో 8 లక్షల వయల్స్ ను భారత్ లో ఉత్పత్తి చేయనుండగా, మరో ఏడు లక్షల వయల్స్ ను విదేశీ విక్రయదారుల నుంచి సమీకరిస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. మే 24న 19,420 వయల్స్ ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేశామని చెప్పారు. మే 21న 23,680 యాంఫోటెరిసిన్-బీ వయల్స్ ను రాష్ట్రాలకు కేటాయించామని వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా 9000కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది.