న్యూఢిల్లీ: పాకిస్థాన్ డ్రోన్లకు చెక్ చెప్పేందుకు భారత ఆర్మీ సిద్ధమైంది. సరిహద్దులోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఆక్వా జామర్లు, మల్టీ షాట్ గన్స్ ఏర్పాటు చేసింది. పాకిస్థాన్కు చెందిన డ్రోన్లు ఇటీవల తరచుగా సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఆయుధాలు, డ్రగ్స్ను అక్రమంగా చేరవేస్తున్నాయి. అలాగే భారత సైనిక కార్యకలాపాలపై డ్రోన్ల ద్వారా పాక్ ఆర్మీ నిఘా వేస్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ డ్రోన్లు, వాటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఆక్వా జామర్లుగా పిలిచే క్వాడ్కాప్టర్ జామర్లను భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి ఏర్పాటు చేసింది. అలాగే డ్రోన్లను కూల్చేందుకు మల్టీ షాట్ గన్ వ్యవస్థలను నెలకొల్పింది.
కాగా, ఆక్వా జామర్లు 4,900 మీటర్ల ఎత్తు వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని, శత్రు డ్రోన్లను గుర్తించడంతోపాటు దాని ఆపరేటర్తో కనెక్టివిటీని కట్ చేస్తాయని రక్షణ అధికారులు తెలిపారు. ఆక్వా జామర్లు డ్రోన్ సిగ్నల్ను 5 కిలోమీటర్ల పరిధి వరకు గుర్తిస్తాయని చెప్పారు. ఆ తర్వాత మల్టీ వెపన్ ప్లాట్ఫారమ్పై అమర్చిన మల్టీ షాట్ గన్స్తో శత్రు డ్రోన్లను కూల్చివేస్తామని వెల్లడించారు. మూడు గన్స్తో కూడిన ఈ వ్యవస్థ త్రికోణంలో ఒకేసారి తొమ్మిది రౌండ్లు కాల్పులు జరుపుతుందని, దీంతో శత్రు డ్రోన్ తప్పించుకోలేదని వివరించారు.
భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి 400 మీటర్ల దూరంలో ఈ రెండు వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అలాగే నియంత్రణ రేఖకు 2.5 కిలోమీటర్ల దూరంలోని నిరంతర నిఘా కేంద్రాలతో ఈ వ్యవస్థలను అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 191 పాకిస్థానీ డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించాయని వెల్లడించారు. వీటిలో 171 డ్రోన్లు పంజాబ్ సెక్టార్లోకి ప్రవేశించగా, 20 డ్రోన్లు జమ్మూ సెక్టార్లో కనిపించినట్లు వివరించారు.