Ketan Agrawal : మహారాష్ట్ర, పూనేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య ఘటన సంచలనం సృష్టిస్తోంది. కేతన్ను అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి హత్య చేసినట్లు తేలింది. కేతన్ను పూనే సమీపంలోని లోహగడ్ కోటకు తీసుకెళ్లి, అక్కడి నుంచి లోయలో తోసేసి చంపేశారు సియా, చేతన్. ఈ ఘటన జూన్ 18న జరిగింది. ఇందుకోసం పక్కా ప్రణాళికలు అమలు చేశారు. ఇంతకుముందు కూడా హత్యకు ఇద్దరూ కలిసి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 6న సియా, కేతన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బాలి, ఇండోనేసియా వెళ్లాల్సి ఉంది.
ఇందుకోసం ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు వారితోపాటు మరికొందరు కారులో బయల్దేరారు. ఆ సమయంలో కేతన్ తన పాస్పోర్టులు, కార్డులు వంటివి ఒక పౌచ్లో పెట్టుకున్నాడు. కారులో కొంతదూరం వెళ్లిన తర్వాత మధ్యలో ఫుడ్ కోసం ఒక చోట ఆగారు. అందరూ ఫుడ్ తింటుండగా.. మధ్యలో సియా తన ఫోన్ కారులో మర్చిపోయాను అని చెప్పి వెళ్లి తన ఫోన్ తెచ్చుకుంది. తర్వాత కారులో ఎయిర్పోర్టు చేరుకున్నారు. అక్కడికి చేరుకుని చెకిన్ అయ్యే సమయంలో కేతన్ పాస్పోర్ట్ మిస్ అయింది. అందరి పాస్పోర్టులు ఉన్నాయి కానీ, అతడి పాస్పోర్టు మాత్రం మిస్సైంది. దీంతో బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. అక్కడికి వెళ్తే అతడిని చంపడం కుదరదని, ఇక్కడే చంపాలని సియా భావించింది. ఇందుకోసం పాస్పోర్టు దొంగిలించి ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా చేసింది. అలాగే, జూన్ 14న కూడా ఇదే కోటకు తీసుకెళ్లింది. అక్కడ కూడా ఒక కొండ అంచుకు తీసుకెళ్లి అతడిని తోసేసింది. అయితే, అక్కడున్న కొన్ని కొమ్మలు, పొదలు పట్టుకుని కేతన్ బయటపడ్డాడు. దీంతో సియా ప్లాన్ విఫలమైంది. అయితే, తను ఎందుకు తోసేసిందో డౌట్ రాకుండా ఉండేందుకు పాము వచ్చిందని, దాన్నుంచి రక్షించేందుకే తోసేసినట్లు చెప్పింది.
ఈసారి ప్లాన్ ఫెయిల్ కావడంతో జూన్ 18న మరోసారి అతడిని లోహగడ్ కోటకు తీసుకెళ్లి తోసేసి చంపేసింది. తాజాగా సియాను, ఆమె ప్రియుడు చేతన్ను పోలీసులు అరెస్టు చేశారు. సియా, కేతన్ వివాహం వచ్చే నవంబర్లో జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్లో పెళ్లి కోసం రాజస్థాన్లో రూ.17 కోట్లతో ఒక ప్యాలెస్ బుక్ చేసినట్లు తేలింది. ఈ హత్యపై కేతన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఇద్దరికీ మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వేరే వ్యక్తిని ప్రేమించినప్పుడు, కేతన్తో పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఉండాల్సిందని, తామేమీ బలవంతం చేసి ఉండేవాళ్లం కాదని అతడి తల్లిదండ్రులు అంటున్నారు.