పాట్నా: మరదలు నిశ్చితార్థం చెడగొట్టేందుకు (To break off engagement) వదిన కుట్ర పన్నింది. మరదలకు కాబోయే భర్తకు తన ప్రియుడి ద్వారా మార్ఫింగ్ ఫొటోలు పంపింది. దీంతో ఆ నిశ్చితార్థం రద్దైంది. చివరకు మరదలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. బీహార్లోని మకర శరన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. యువతికి ఒక వ్యక్తితో పెళ్లి నిశ్చియమైంది. అయితే కుటుంబ కలహాల వల్ల మరదలైన ఆమె పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలని వదిన భావించింది. దీని కోసం కుట్ర పన్నింది. వివాహేతర సంబంధం ఉన్న 19 ఏళ్ల శుభం కుమార్ సహాయం కోరింది. దీంతో అతడు ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఎకౌంట్ సృష్టించాడు. యువతి కాబోయే భర్త, కుటుంబ సభ్యులకు మార్ఫింగ్ చేసిన ఆమె అసభ్యకర ఫొటోలు, మెసేజ్లు పంపాడు. ఈ నేపథ్యంలో నిశ్చితార్థం ఆగిపోయింది.
కాగా, మార్చి 20న బాధిత యువతి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కాబోయే భర్తకు తన మార్ఫింగ్ ఫొటోలు పంపారని, దీంతో నిశ్చితార్థం రద్దైనట్లు ఆరోపించింది. పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఇన్స్టాగ్రామ్ను సంప్రదించి ఫేక్ ఐడీ వివరాలు పొందారు. యువతి కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫొటోలు పంపిన వ్యక్తిని శుభం కుమార్గా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేయడంతోపాటు మార్ఫింగ్ ఫొటోలున్న మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆ యువతి వదినతో తనకు సంబంధం ఉందని శుభం తెలిపాడు. కుటుంబ విభేదాల వల్ల మరదలు నిశ్చితార్థాన్ని చెడగొట్టాలని ఆమె తనను కోరిందని చెప్పాడు. దీంతో యువతి వదినను ప్రశ్నించిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకున్నారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.