చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిలదీశారు. ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు ఏవి?, మదురై ఎయిమ్స్ సంగతి ఏమైంది? అంటూ ప్రశ్నించారు. శుక్రవారం ఒక వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీని విమర్శించారు. తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధానిని అడిగితే ఆయన నుంచి సమాధానం లేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకోలేదన్నారు. మదురై ఎయిమ్స్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. నల్ల ధనాన్ని వెనక్కి రప్పిస్తామని, ప్రతి భారతీయ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని మోదీ చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. 15 లక్షలు కాదు కదా, ఒక్కొక్కరికి రూ.15,000 లేదా కనీసం రూ.15 అయినా జమచేశారా? అని నిలదీశారు.
కాగా, భారత్, శ్రీలంకను కలిపే జలమార్గమైన సేతుసముద్రం ప్రాజెక్టును పునరుద్ధరించాలని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు డిమాండ్ చేసినప్పటికీ ప్రధాని మోదీ వద్ద సమాధానం లేదని సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. మదురై ఎయిమ్స్ ప్రాజెక్ట్ను పూర్తి చేయకపోవడంపై బీజేపీ సిగ్గుపడాలని అన్నారు. తన కుమారుడు ఉదయనిధి 2019లో చేపట్టిన నిరసన వంటిది మరోసారి చేయాలా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేసినప్పటికీ నోరు మెదపకపోవడం ఆయనకు అలవాటుగా మరిందంటూ స్థాలిన్ మండిపడ్డారు.