Kakoli Ghosh Dastidar : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) కి బరాసత్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ షాకిచ్చారు. ఆమె టీఎంసీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలే ఆమె టీఎంసీ బరాసత్ పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగడం గమనార్హం. దస్తిదార్.. బరాసత్ లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు.
ఇటీవల ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన కీలక పరిపాలన సమావేశానికి కరోలి దస్తిదార్ హాజరయ్యారు. ఇప్పుడు టీఎంసీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీని వీడటం ఎంతో బాధాకరమని కకోలి ఘోష్ దస్తికార్ అన్నారు. తాను అఖిల భారత తృణమూల్ మహిళా కాంగ్రెస్ ఛైర్పర్సన్ పదవితో పాటు, పార్టీలోని ఇతర సంస్థాగత పదవులు, కమిటీలు, బాధ్యతల నుంచి తప్పుకున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు.
పార్టీకి చెందిన ఒక ఎంపీ.. మహిళా ఎంపీ పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై పార్టీ అధినేత్రి స్పందించనప్పుడు పార్టీలో ఎందుకు కొనసాగాలని కకోలి ఘోష్ ప్రశ్నించారు. తనకు మమతా బెనర్జీ 1976 నుంచి తెలుసని, 1984 నుంచి ఆమెతో కలిసి పనిచేస్తున్నానని గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తన విధేయతకు లభించిన బహుమతి ఇది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.