కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తైన తర్వాత లోక్ సభలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ తర్వాత సభ వాయిదా పడింది. దీని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ఎంపీల వద్దకు వెళ్లి, బడ్జెట్ గురించి మాట్లాడటం కనిపించింది. ఈ ముచ్చట జరుగుతున్న సమయంలోనే తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ హఠాత్తుగా ప్రధాని మోదీ దగ్గరికి వచ్చారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ విషయం లేవనెత్తారు. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన పనితీరు ఏమాత్రం బాగోలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూడా రోజూ ఇరుకున పెడుతున్నారని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్ ధన్కర్ను వెంటనే పదవీ నుంచి తొలగించాలని సౌగత్ రాయ్ ప్రధాని మోదీని నేరుగా డిమాండ్ చేశారు.
ఈ ఫిర్యాదుపై ప్రధాని మోదీ స్పందించారు. ముందు మీరు రిటైర్డ్ అవ్వండి. ఆ తర్వాత ఆయన్ను పదవీ నుంచి తొలగిద్దాం అని నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో సౌగతా రాయ్ మళ్లీ ధన్కర్ గురించే ప్రస్తావించారు. చివరికి..ఈ వ్యవహారం ఎంతకీ తెగకపోవడంతో అటు ప్రధాని మోదీ, తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని, అక్కడి నుంచి నిష్క్రమించారు.