న్యూఢిల్లీ, నవంబర్ 24: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా మరింత చిక్కుల్లో పడ్డారు. మొయిత్రా పార్లమెంట్ ఐడీ దుబాయ్ నుంచే కాదు అమెరికాలోని న్యూజెర్సీ, బెంగళూరు నుంచి కూడా లాగిన్ అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్లో అడగాల్సిన ప్రశ్నలు టైప్ చేయడానికి తన పార్లమెంట్ ఐడీని వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీకి ఇచ్చినట్టు ఆమె ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. కాగా, తాజాగా మొయిత్రా లాగిన్పై వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆమెను లోక్సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది.