కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో (Sandeshkhali) మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్ షాజహాన్ షేక్ (Sheikh Shahjahan) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖాలోని ఓ ఇంట్లో ఉంటున్న ఆయనను గురువారం ఉదయం 3 గంటలకు అదుపులోకి తీసుకున్నటుల పోలీసులు ప్రకటించారు. అనంతరం బసిర్హత్ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.
ఈ ఏడాది జనవరి 5న రేషన్ పంపిణీ కుంభకోణంపై విచారణకు సంబంధించిన షాజహాన్ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై సుమారు వెయ్యి మంది దాడికి పాల్పడ్డారు. అప్పటినుంచి ఆయన కనిపించకుండా పోయారు. దాదాపు 55 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న షాజాహాన్ను పోలీసులు నేడు పట్టుకున్నారు. కాగా, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సందేశ్ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈడీ, సీబీసై సైతం ఆయనను అరెస్టు చేయొచ్చని కోల్కత్తా హైకోర్టు బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.