కోల్కతా: పశ్చిమబెంగాల్లో రేషన్ పంపిణీ కుంభకోణం (Ration Distribution Scam) అధికారపార్టీ నేతల్లో ఈడీ వణుకు పుట్టిస్తున్నది. పీడీఎస్ స్కామ్లో ఇప్పటికే టీఎంసీ (TMC) నేతలను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగా మరో నాయకుడిని అదుపులోకి తీసుకున్నది. విస్తృత సోదాల అనంతరం బాంగావ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శంకర్ ఆధ్యాను (Shankar Adhya) అధికారులు అరెస్టు చేశారు. అయితే విచారణలో సహకరించినప్పటికీ తన భర్తను అరెస్ట్ చేశారని శంకర్ సతీమణి జ్యోత్స్న తెలిపారు.
రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి శంకర్ అధ్యా, మరో టీఎంసీ నాయకుడు సహజాన్ షేక్ ఇండ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగాల్లో లబ్దిదారులకు అందాల్సిన రేషన్ సరుకుల్లో నిందితులు దాదాపు 30 శాతం బహిరంగ మార్కెట్కు తరలించారని ఈడీ పేర్కొంది. కాగా సోదాల సందర్భంగా సహజన్ షేక్ మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి చేశారు. దాదాపు 800-1000 మంది మూక దాడికి వచ్చారని, అధికారులు, భద్రతా సిబ్బందిని ఘెరావ్ చేశారని ఈడీ పేర్కొన్నది. ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, పర్సులు వంటివి కూడా దోచుకెళ్లారని, దాడిలో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. గాయాలైన అధికారులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.