హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఏ రాష్ట్రంలో లేనివిధంగా కరోనా బారినపడిన జర్నలిస్టులను మీడియా అకాడమీ ఆదుకున్నదని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఎదురైన కరోనా ఇబ్బందులను కొద్దిమేరకైనా తొలగించడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఇప్పటివరకు కరోనా సోకిన జర్నలిస్టులకు రూ.5.15 కోట్లు సాయం అందించిందని వివరించారు. తొలి విడుత కరోనా సమయంలో వైరస్ సోకిన దాదాపు 1,553 మంది జర్నలిస్టులకు రూ.3.106 కోట్లు, కరోనాతో హోంక్వారంటైన్లో ఉన్న 87 మందికి రూ.8.70 లక్షలు అందించామని తెలిపారు. రెండో దశలో దాదాపు 1,958 మంది జర్నలిస్టులకు కరోనా సోకిందని, మలి విడుత ఆర్థికసాయం రూ.10 వేల చొప్పున రూ.1.958 కోట్లు సాయంచేశామని వివరించారు. రెండో విడుత కరోనా చాలా మంది జర్నలిస్టులను బలిగొన్నదని, పేరుగాంచిన జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది మహమ్మారితో అకాల మరణం పొందారని చెప్పారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని మీడియా అకాడమీ నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నెలలోపు ఈ రూ.2 లక్షలు ఏక మొత్తంగా అందజేస్తామని, 5 ఏండ్లపాటు నెలకు రూ.3 వేల పెన్షన్ లభిస్తుందని వివరించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకొంటున్నవారిలో గరిష్ఠంగా ఇద్దరికి రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. రెండు విడుతలు కలిపి మీడియా అకాడమీలో ఉన్న రూ.34.50 కోట్ల కార్పస్ ఫండ్పై వచ్చిన వడ్డీని జర్నలిస్టులను ఆదుకోవడానికి వినియోగించామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి రూ.42 కోట్లకు చేరినట్టు అల్లం నారాయణ తెలిపారు. మార్చి 2021 వరకు రూ.34.50 కోట్లతో సంక్షేమ నిధి ఉండేదని, దీనికి అదనంగా ఈ ఏడాది ఏప్రిల్లో రూ.7.50 కోట్లు సమకూరినట్టు వివరించారు. మీడియా అకాడమీలో తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం వాట్సాప్ ద్వారా పంపిన 3,600ల కొవిడ్ సహాయ దరఖాస్తులను పరిష్కరించామని పేర్కొన్నారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ,
ఇంటి నం.10-2-1,సమాచార భవన్,
2వ అంతస్తు, ఏసీ గార్డ్స్, మాసాబ్ ట్యాంక్,
తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్.